హిందుత్వమనేది ఒక మతం కాదు, హిందూ దేవీ దేవతలు అఖండ ప్రకృతి శక్తులకు ప్రతీకలు: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌....
భారతదేశంలో వివిధ రకాలైన ప్రజలు ఆరాధించే లేదా ఆచరించే వివిధ రకాలైన ఆరాధనా పద్దతులను ఒక మతంగా పరిగణించలేమని ముంబయిలోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఒక కేసులో వ్యాఖ్యానించడం భారతీయ సమాజంచే స్వాగతించబడుతుంది. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగం నుండే ఎన్నో వేల రకాల ప్రజలు నివసిస్తున్నారు. వారు ఎన్నో విధమైన మత విశ్వాసాలు కలిగియున్నారు. విభిన్నమైన ప్రకృతి శక్తుల్ని లేదా ప్రతీకల్ని కొలుస్తూ ఉన్నారు. నిజానికి వారందరూ తమ తమ మత విశ్వాసాల దృష్ట్యా వేర్వేరు అయినప్పటికీ, వారందరినీ కలిపి ఉంచింది మాత్రం భారత సంస్కృతి ఒక్కటే. అదే వేద సంస్కృతి.
ఈ దేశంలోని ప్రజలు ఏనాడు మతం పేరు చెప్పి కలహించుకోలేదు. దేవుడి పేరు చెప్పి ఇతరుల్ని దోచుకోలేదు, చంపలేదు. ఎంత విభిన్నమైనప్పటికీ వారందరినీ కలిపి ఉంచింది మాత్రం అఖండ ప్రకృతి శక్తుల ఆరాధన మాత్రమే. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు నిజానికి భారతీయ వేదాంత సారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఆచితూచి చేసిన వ్యాఖ్యానంగా మనం గమనించవచ్చు. కాని, బయటి వారికి మాత్రం హిందూ మతం ఒక మతమే కాదన్న వాదన చేయడానికి ఒక ఆయుధంగా పనికివస్తుంది. ట్యాక్స్‌ ఎగ్గొట్టడానికి హిందూ సంస్థలు చేసే ప్రయత్నంగా కొన్ని బ్లాగుల్లో ప్రచురించడం చూసాను. అటువంటి వారు ఎన్ని చెప్పినా వాస్తవం మాత్రం ఒక్కటే.
భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు. భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు. అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు. దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు. ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో దైవాన్ని దర్శిస్తాడు. అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది. భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం ఊహాత్మకం (Abstract) కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు. ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు. కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం. భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.


శివునికి ప్రత్యేకించి ఒక రూపం లేదు. ఆయన లింగాకారుడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే శివ తత్వం. శరీరంలో ఉన్న ప్రాణమే శివుడు అంటారు (శివపురాణం). అందుకే శివుడికి ఆత్మలింగం ఉంటుంది. ఆత్మయే శివుడు. ఆ శివుడు వెళ్ళిపోతే మిగిలిందే శవం. అంటే జీవుడి నుండి శివుడు వేరయితే అది శవం. అంటే జాతి, కుల, మత బేధం లేకుండా ప్రతి ప్రాణిలో ఉండే ప్రాణమే శివుడు. అది ఏ జాతి అయినా, ఏ దేశమయినా, ఆఖరికి మన ప్రపంచం కాకుండా వేరే లోకమైనా కూడా అందరిలోను శివతత్వాన్ని చూడవచ్చు. దీన్నే విశ్వజనీయత ( Universality) అంటారు. ఈ విశ్వాసానికి ఏ మత గ్రంధం అక్కర్లేదు. ఎవరూ చెవిలో ఇల్లు కట్టుకుని, పోరుపెట్టి చెప్పనక్కర్లేదు. పాంప్లెట్లు పంచనక్కర్లేదు.
ఇక విష్ణువు విషయానికి వస్తే, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మరోలా చెప్పుకుంటే ఈ విశ్వమే విష్ణువు (విశ్వం విష్ణ్ణు: - విష్ణు సహస్రనామ స్తోత్రం, మొదటి నామం), లోకాలన్నీ ఎవరిలోనైతే ఇమిడి ఉన్నాయో, ఎవరైతే ఈ లోకాలన్నిటిలోను నివాసం ఉంటున్నాడో ఆయనే (ఆ మహాశక్తే) విష్ణువు. (వాసితం భునవత్రయం - సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే). అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీ జీవి, ప్రతీ వృక్షం, ప్రతీ మనిషీ - మరలా చెబుతున్నాను, కేవలం ఈ దేశంలోనో, ఈ మతంలోనో కాదు, జీవించి ఉన్న ప్రతీ జీవి కూడా, విష్ణువే అని భారతీయ దర్శనం. భారతీయ సంస్కృతిలో మరో విశేషమేమిటంటే, ప్రకృతిని మాతృ భావనతో ఆరాధించడం. అదే దుర్గా స్వరూపం. ఇంతటి ఉన్నతమైన భావన కేవలం భారతీయులకు మాత్రమే ఉన్నదని నేను గర్వంగా చెప్పగలను. నేను మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవారు ఎవరైనా చెప్పగలరు.

Popular Posts

 
Top