శరీరం తనను తాను మరమ్మత్తులు చేసుకునే క్రమంలో వచ్చే అనారోగ్యమే 'జ్వరం'. దీని ద్వారా హానికరమైన బాక్టీరియా, క్రిములు, వైరస్‌లు శరీరం నుంచి బయటికి వెళ్లగొట్టబడతాయి. లేకపోతే వీటి వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. వేరే ఇతర క్రిములు పెరగకుండా ఉండేందుకే శరీరం వెచ్చబడుతుంది. అయితే మనలో అనేక మంది జ్వరం వస్తే ఏం తినాలి? ఏం తినకూడదనోనని అయోమయానికి గురవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సూచనలు. చదివి తెలుసుకోండి.

1. జ్వరం వస్తే ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ఉత్తమం. వీటిలోనూ పోషకాలు అధికంగా ఉన్నవైతే ఇంకా మంచిది. తాజా పండ్లు, కూరగాయల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, వేడి వేడి సూప్స్ తీసుకోవచ్చు.

2. విటమిన్ ఏ, ఈ, సీలు సమృద్ధిగా ఉండే ఆహారం తినడం చాలా మంచిది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది. బొప్పాయి, నారింజ, పుచ్చకాయలు, కివీ పండ్లు, జామ, స్ట్రాబెర్రీలు తినడం ఉత్తమం.

3. జ్వరం వచ్చినప్పుడు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. ఇది శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తుంది. పాలు, ఉడకబెట్టిన గుడ్లు (పచ్చ సొన లేకుండా), పెసర, కంది పప్పు, మొలకెత్తిన గింజలు, చేపలు తినవచ్చు.

4. పైన పేర్కొన్నవే కాకుండా పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని తక్షణ శక్తి కోసం తీసుకోవాలి. అరటిపండ్లు, తేనె, బెల్లం, అన్నం, ఆలుగడ్డలు తదితరాలను తినాలి.

జ్వరం రావాడానికి ముందు ప్రతోక్కరికి సూచన ప్రాయంగా దాని లక్షణాలు అనుభవమవుతుంటాయి. అలాంటి వాటిని ‘పూర్వరూపాలు’ అంటారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నాలుక మందంగా తయారవడం, బడలిక మొదలైన వాటిని పూర్వ రూపాలుగా భావించాలి. జ్వరంలో ఆకలిమీద మొదటి వేటు పడుతుంది. అందుకే జ్వరంలో తీసుకునే ప్రతి చర్యా ఆకలిని రక్షించే విధంగా, లేదా వీలైతే పెంచే విధంగా ఉండాలి, లఘు భోజనం అందుకు ఉపకరిస్తుంది. లంఘన చికిత్సలో లఘు భోజనంతోపాటు ఆహారం తేలికగా జీర్ణమవడం కోసం పాచన ఔషధాలను కూడా ప్రయోగించాల్సి ఉంటుంది.

వేడినీళ్లు తాగాలి:

జ్వరంలో వేడినీళ్ల వాడకాన్ని ఆయుర్వేదం ప్రముఖంగా చెప్పింది, ముఖ్యంగా కొత్తగా వచ్చిన జ్వరాన్ని తగ్గించడంలో వేడినీళ్లు ప్రధాన పాత్ర పోషి స్తాయి. వేడినీళ్ల వలన ఆకలి పెరుగుతుంది.

షడంగ పానీయం:
జ్వరంలో ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. తుంగ ముస్తలు, పర్పాటకం, వట్టి వేర్లు్ల, చందనం, కురువేరు, శొంఠి ఈ ద్రవ్యాలను షడంగాలంటారు. ఇవి దినుసులు అమ్మే దుకాణాలలో లభ్యమవుతాయి. ఈ ద్రవ్యాలను అన్నిటిని సమాన భాగాలుగా తీసుకుని వాటిని 64 రెట్లు నీళ్లు పోసి సగభాగం మిగిలే వరకు కాచాలి. తరువాత మూత పెట్టి చల్లార్చాలి. దీనిని వడపో సుకుని ఏ పూటకాపూట తాగితే చక్కని ఫలితం కనిపిస్తుంది

జావ తాగడం మంచిది:
మీరు తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు… ఇటువంటిది ఏదైనా కానీయండి, దీనిని రవ్వలాగా మరపట్టించి, దోరగా వేయించి, నీళ్లతో కలిపి జావలాగా చేసుకొని తాగితే తేలికగా జీర్ణమవుతుంది.

ఫలరసాలు:
జ్వరంతో ఒళ్లు వేడిగా తయారైనప్పుడు శరీరం చల్లబడటం కోసం చమట పుడుతుంది. ఇలా మరీ ఎక్కువసేపు జరిగితే శరీరం లోపల మిగిలి ఉన్న నీటిని కాపాడుకోవడం కోసం స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. దీనితో జ్వరం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే సమృద్ధిగా ద్రవాహారాలను, పండ్లరసాలను తీసుకోవాలి.

శీతలోపచారాలు:
జ్వరం 103 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ను మించుతున్నప్పుడు శీతలోపచారాలు చేపట్టడం ముఖ్యం. తడి బట్టనుకాని, స్పాంజ్‌ ను గాని నీళ్లలో ముంచి గట్టిగా పిండి ఒళ్లంతా తుడవాలి. చంకలు, గజ్జలు మొదలైన భాగాలలో వేడి కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను ప్రత్యేక శ్రద్ధతో తుడవాలి.

దుప్పట్లను అవసరానుసారం వాడాలి:
జ్వరంగా ఉన్నంత మాత్రాన దుప్పటి కప్పుకోకూడదు. కేవలం చలిగా ఉన్నప్పుడు మాత్రం కప్పుకుంటే సరిపోతుంది.

ఇవన్ని జ్వరం వచ్చినప్పుడూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలా చేస్తే మీకు త్వరగానే జ్వరం తగ్గోచ్చు.. ఇలా చేసిన ఒకటి, రెండు రోజులు మీరు జ్వరంతో బాధపడుతుంటే వైద్యుడ్ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Popular Posts

 
Top