ఒకేచోట ప్రైవేటు విద్యాసంస్థలు విశాఖ సమీపంలో 5వేల ఎకరాల్లో ఏర్పాటు 12 మందితో ఉన్నత స్థాయి కమిటీ 20 రోజుల్లో సమగ్ర నివేదిక

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పట్టణంలో ఒకేచోట రెండువేల విద్యాసంస్థలను నెలకొల్పిన తీరులోనే ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. విశాఖ పరిసరాల్లో కనీసం ఐదు వేల ఎకరాల్లో ఎడ్యుకేషన్ సిటీ పేరుతో నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

హర్యానాలో సోనేపట్, న్యూ చండీగఢ్ (మొహాలి) తదితర చోట్ల ఎడ్యుకేషన్ సిటీలను ఏర్పాటు చేశారు. సోనేపట్‌లో ఒకేచోట పది యూనివర్శిటీలు, మొహాలిలో సైతం ఒకేచోట 100 విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. విశాఖ పరిసరాల్లో కనీసం 5వేల ఎకరాలను సేకరించగలిగితే ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటుచేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశ్వవిద్యాలయాలు తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకువస్తే వాటికి అవసరమైన ‘స్పేస్’ను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు ముసాయిదాను ప్రజల ముందుంచిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తగిన మార్పులు చేసి అమలులోకి తీసుకురానుంది. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు 12మంది సభ్యులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ అక్టోబర్ 15 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. కమిటీకి ల్యాండ్ రెవిన్యూ చీఫ్ కమిషనర్ అధ్యక్షత వహిస్తారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఇందులో పాఠశాల విద్య, ఆర్థిక శాఖ, వౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి గంటా సుబ్బారావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పి నర్సింహారావు, ఐఎస్‌బి డీన్ డాక్టర్ ప్రమాత్ రాజి సిన్హా, నాలెడ్జి అడ్వయిజరీ బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ ఆనంద్ సుదాసన్, ఐటి సలహాదారు జె సత్యనారాయణ సభ్యులుగా ఉంటారు.

Popular Posts

 
Top