దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతోన్న కేంద్రం తాజాగా ఐఐటీ, ఎన్ఐటీలకు ఒకే పరీక్ష నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం కారణంగా గత ఏడాది ఐఐటీల్లో 1500, ఎన్ఐటీల్లో సుమారు రెండు వేల సీట్లు మిగిలిపోయాయి. దీనికి కారణంగా అర్హత గల విద్యార్థులు లేకపోవడం కాదు. ఎంసెట్, ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్ డ్ పరీక్షల మధ్య మూడు నుంచి నాలుగు నెలల అంతరం ఉండడం ఒక కారణం. ఐఐటీ, ఎన్ఐటీ, ఎంసెట్ కౌన్సిలింగ్ గందరగోళం మరో కారణంగా విద్యా నిపుణులు భావిస్తున్నారు.

విలువైన సీట్లను కోల్పోకుండా ఉండడమే కాకుండా విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించడానికి నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను దేశ వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడానికి కేంద్ర మానవవనరులశాఖ తుది నిర్ణయానికి వస్తోంది. ఇటీవల మెడిసిన్ అడ్మిషన్లకు సంబంధించి ఎంసీఐ కూడా కేంద్రానికి ఒకే ఎగ్జామ్ నిర్వహించాలని సూచించింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదనలకు ఎక్కవ మంది విద్యా నిపుణులు మద్ధతు పలుకుతున్నారు. కానీ, ఎంసీఐ నిర్ణయం వెలువడిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం మెడిసిన్లో జాతీయ స్థాయి అడ్మిషన్లను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. ఇదే అంశం కోర్టులో కూడా పెండింగ్ లో ఉంది.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించడానికి కేంద్రం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయడానికి అడుగులువేస్తోంది. మరోవైపు తాజాగా ఐఐటీ, ఎన్ఐటీ, ఇంజనీరింగ్ అడ్మిషన్లకు జాతీయ స్థాయి పరీక్ష రూపకల్పనకు సన్నద్ధం అవుతోంది. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు పలు పరీక్షలను రాస్తూ, ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో ఫీజుల రూపంలో భారీగా చెల్లిస్తున్నారు. పలు పోటీ పరీక్షలు రాయడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఒకే పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఆర్థికంగానూ, మానసికంగానూ భారం తగ్గించడానికి విద్యా విధానాన్ని సంస్కరించడానికి కేంద్రం తుది నిర్ణయానికి వస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కేటాయించడం ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాన్ని జాతీయ స్థాయికి, రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అడ్మిషన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంకును ప్రాతిపదికగా తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించి, జాతీయ స్థాయి పరీక్షను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతోన్న ఆబ్జెక్టివ్ పద్ధతి స్టూడెంట్స్ సామర్థ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతోందని భావిస్తున్నారు. విద్యా సంస్కరణలు వేగం పుంజుకుంటోన్న ప్రస్తుత తరుణంలో ఇంటర్ వెయిటేజ్ మార్కుల పద్ధతిని పూర్తిగా తొలగించి, డిస్క్రిప్టివ్ పద్ధతిలో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైన కేంద్రం తుది నిర్ణయానికి రావడానికి పలువురి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటోంది. వీలున్నంత వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్, ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్ డ్ పరీక్షలకు ప్రత్నామ్నాయంగా జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడానికి కేంద్రం సిద్ధం అవుతోంది

Popular Posts

 
Top